DailyDose

ఏపీలో పీఠాధిపతుల కొత్త పార్టీ?

ఏపీలో పీఠాధిపతుల కొత్త పార్టీ?

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందినవారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపించమని కోరారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని భద్రతా సిబ్బంది నిలిపేశారు. ముందుగా లేఖ ద్వారా తెలియజేశామని, అయినా ఇలా అవమానిస్తారా? అంటూ కొద్దిసేపు అక్కడే నిరసన వ్యక్తం చేశారు.

తర్వాత వీరంతా శ్రీనివాస మంగాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన శ్రీయోగి పీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో ధనవంతులకు, రాజకీయ నేతలకు మాత్రం స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని, అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని హెచ్చరించారు.

తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామని వెల్లడించారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని, త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న అవినీతికి సంబంధించి ఇప్పుడు పీఠాధిపతులే కాకుండా కొందరు వీఐపీలు దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.