Movies

రీ ఎంట్రీ ఇవ్వనున్న భానుప్రియ చెల్లెలు

రీ ఎంట్రీ ఇవ్వనున్న భానుప్రియ చెల్లెలు

నటి నిశాంతి గుర్తుందా? భానుప్రియ సోదరి శాంతి ప్రియనే ఈ నిశాంతి. 1990 ప్రాంతంలో కోలీవుడ్లో కథానాయకిగా ఒక వెలుగు వెలిగిన నటి నిశాంతి. తన నటన, పాత్రధారణలతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఎంగ ఊరు పాటకారన్, నేరం నల్లా ఇరుక్కు, రైలుక్కు నేరమాచ్చు, సిగరెట్టు, తాళి వంటి పలు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించినా తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు.కాగా వివాహానంతరం నటనకు దూరమై, సంసార జీవితంపై దృష్టి సారించిన నిశాంతి చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు సునిలెట్టికి చెల్లెలిగా పొన్నమ్మ పాత్రలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వెబ్సరీస్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ఆ పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని నిశాంతి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సరోజిని నాయుడు ది అన్ సాంగ్ ఫ్రీడమ్ ఫైటర్ అనే చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇకపై తమిళం, తెలుగు భాషల్లో వరుసగా చిత్రాల్లో నటించనున్నట్లు వెల్లడించారు.