Politics

అమరావతి: జగన్ సర్కార్‌పై సుప్రీం ప్రశ్నల వర్షం

అమరావతి: జగన్ సర్కార్‌పై సుప్రీం ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పులో మరికొన్ని అంశాలు జోడించాలని వాటికి కూడా న్యాయం చేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తొలుత వాదనలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలు ఉంచగా.. అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చగలదా? అలాంటి పరిస్థితి ఉందా? రాష్ట్ర విభజన చట్టంలో ‘ఒక రాజధాని’ అని మాత్రమే ఉంది. కానీ, పలు భాష్యాలు తీసుకోవాలని ఎక్కడా రాసి లేదు కదా? పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల ప్రకారం తీసుకున్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అమరావతిలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు. మరికొన్ని నిర్మాణాలు 70శాతం, 90శాతం చొప్పున పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటన్నింటికి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పుడు మార్చాలనుకుంటే వాటిని ఏం చేయాలి? అది ప్రజల సంపద కాదా? పెట్టుబడుల రూపంలో సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అది ఎలా సాధ్యమవుతుంది?భూ సమీకరణలో రైతులకు ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారు?ప్రభుత్వ హామీ నమ్మి భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు? సీఆర్‌డీఏ చట్టం అమలు చేయకపోతే ప్రజల నమ్మకం వమ్ము చేసినట్లు కాదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.