Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు.. వెంకన్న కటాక్షం ఎవరికి దొరుకుతుంది?

TNI ఆధ్యాత్మిక వార్తలు.. వెంకన్న కటాక్షం ఎవరికి దొరుకుతుంది?

వెంకన్న కటాక్షం ఎవరికి దొరుకుతుంది?

విష్ణుపాదుని దివ్యకథ….!!

గోవింద అంటే స్తుతింపబడినవాడు అని అర్ధం.

ఈ సృష్టి మొత్తంలో శ్రీమన్నారాయణుల వారికంటే స్తుతించదగినవాడు ఎవరుంటారు.

అందుకే సమస్త ప్రాణికోటి నిత్యం ఆ స్వామినే కీర్తిస్తుంటారు.

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఆ పరబ్రహ్మమూర్తిని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులని, దివ్యభోగ భాగ్యాలను వివరిస్తున్నాయి.👌

తిరుమల కొండలలో ….
ఈ గోవిందనామమే నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి గోవిందనామ స్మరణతో ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి

పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనందనిలయంలో ఉన్న హుండీ ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది.

అది ఎటూ కదలక భక్తులను చూస్తూ అక్కడే ఉంది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించుకుని అటు తరువాత ప్రక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు.

అలా ప్రతిభక్తుడు ఒక్క క్షణం చిలుకవద్దనే నిల్చుని ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నాడు. ఆ చిలుకకు ఒకే కన్ను ఉండటం భక్తులలో కొందరు గమనించారు.

రెండవ వైపు కన్ను మూసుకునే ఉన్నది. ఆ ఒంటికన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు నెమ్మదిగా దానిని నిమరగా బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకుని ప్రతి భక్తుడు అదే పని చేయసాగాడు.

ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఈ చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది భక్తులు దానిని ముట్టుకుంటున్నా అది అసలు ఎటూ ఎగరటం లేదు ఎందుకని. వారెవరికి అర్ధం కాలేదు.

అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుక మాత్రం అక్కడనుండి కదలలేదు. రాత్రి చీకటి పడిన తరువాత బహుశా ఏ పండో తినడానికి ఎగిరి వెళుతోంది. తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడకే వచ్చి అదేచోట నిలుస్తోంది.

ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్ధమై ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ గలవాడని అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు చెప్పుకున్నారు.

ఇది విన్న అర్చకులు ఆలయంలోని చిలుక గురించి చెప్పారు.
అప్పుడు ఆ సాధువు స్వామిని దర్శించుకొన్న తరువాత హుండీ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు.

వెంటనే ఆ చిలుక రెండవ కన్ను తెరుచు కున్నది…
అప్పుడు ఆ చిలుక ఆ సాధువుతో ఇలా అన్నది. స్వామీ! తమరు మహానుభావులలాగా ఉన్నారు.

నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెప్తాను వినండి…
కిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాపకార్యాలు చేయడం వలన ఈ జన్మలో ఇలా పక్షిరూపం ధరించాను.

అది కూడా పుట్టు గుడ్డిగా జన్మించాను. కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై, ఈ చెట్టుపై వాలుతూ దొరికిన ఫలాలను తింటూ కాలం గడిపాను.

అలా ఎక్కడెక్కడో ఎగురుతూ ఈ కొండపైకి చేరాను. వారం రోజులక్రితం ఈ ఆలయసమీపంలోనికి వచ్చాను.
ఇది ఆలయం అని నాకు తెలియదు.

ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను. అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యివేసి నెమ్మదిగా నిమిరి వెళ్లిపోయాడు.

అంతే! క్షణంలో నాకు ఆ భక్తుడు నిమిరినవైపు కంటిచూపు వచ్చింది. నేనున్న ప్రదేశం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుని ఆలయంగా గ్రహించాను.

నన్ను ఆవిధంగా నిమిరిన ఆ భక్తుడు ఏ అహంకారం లేక స్వామినే సర్వంగా భావించి, ఆరాధించేవాడు. సర్వకాల సర్వావస్థలయందు ఆ స్వామినే స్మరిస్తూ ఏపని చేసినా అది
శ్రీ వేంకటేశ్వర ప్రీత్యర్థంగా భావించి చేసేవాడు.

రోజూ ఉదయాన లేవగానే, తిరిగి రాత్రి పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలనే స్మరించేవాడు. ఎవ్వరినీ తరచు మాటలతో నిందింపడు.

ఎటువంటి చెడు ఆలోచనలూ చేయడు. దేనికీ తొణకడు. అంతటి అసమాన్య భక్తుని స్పర్శ తగలడంతో నాకు కంటిచూపు వచ్చింది. నా రెండవ వైపు కూడా నిమిరితే రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనికై చూశాను.

కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది.
ఆ చిలుక ఆ సాధువుతో ఇంకా ఇలా చెప్పసాగింది. ‘ఈ ఆలయంలో రోజూ ఎందరో భక్తులు స్వామి దర్శనార్ధమై రావటం గమనిస్తున్నాను.

వీరిలో ఒక్కరైనా అంతటి పుణ్యాత్ములు ఉండకపోతారా అని చూస్తున్నాను. అందువలననే ఎటూ ఎగరకుండా రోజంతా ఇక్కడే ఉంటున్నాను.

అంతటి నిస్వార్థ భక్తుడికోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో వేలమంది ఇప్పటిదాకా నన్ను స్పృశించి వెళ్లారు. కానీ నా రెండవకంటి చూపు రాలేదు.

ఇంకా ఎన్నాళ్ళిలా వేచి ఉండాలా, ఎప్పటికి అంతటి భక్తుడు వస్తాడా అనిఅనుకుంటున్నాను …ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు.అని
అన్నది.

ఆ చిలుక చెప్పినదంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న అర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు.

తిరుమల వచ్చేవారిలో చాలామంది విహారానికి వచ్చినట్లు వస్తారు. వచ్చినవారిలో కూడా చాలామంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టరు.

రెండుసార్లు దర్శించుకున్నానని, మూడు సార్లు దర్శించుకున్నానని గొప్పలుగాచెప్తారు. తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు.
ఆ స్వామికి కావలసింది అచంచలభక్తి.

అంతేకానీ, హంగు, ఆర్భాటాలు కావు.
ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్నవదనంతో ఉంటూ తోటివారిలో ఆ స్వామినే చూస్తూ గడుపుతారు. వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమౌతాడు.

ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో వారి బాధ్యత తానే వహిస్తానంటాడు ఆ స్వామి. కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనే మూడుగా ఉంటాయి.

శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే మనం పూర్వజన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబదడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూదిపింజలకంటే తేలికగా ఉండేలా అనుగ్రహిస్తాడు.

అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర, ప్రారబ్ధ కర్మఫలాలను కూదా దివ్య సుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ అమృతమూర్తి ఒక్కడే.

ఓ శ్రీ వేంకటేశ్వరా! నీవేమా కల్పతరువు, నీవే మా ఆప్తుడవు, నీవే మా సర్వస్వమూ నీకివే మా నమస్కారములు. ఓ జగన్నాథా! నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షకా నీకివే మా నమస్కారములు.

శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్‌
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

హరే కృష్ణ

Vaikunta ekadasi:టిక్కెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం:తితిదే ఈవో ధర్మారెడ్డి

తిరుమల: వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.అయితే, టోకెన్లు లేనివారు తిరుమలకు రావొచ్చని, కానీ శ్రీవారి దర్శనానికి అనుమతించమని ఈవో చెప్పారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ‘డయల్‌ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో వివరించారు.ఈవో మాట్లాడుతూ.. ”వైకుంఠ ద్వార దర్శనాల వేళ రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను జారీ చేస్తాం. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తాం. తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తాం. శ్రీవారి ట్రస్టు దాతలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తాం. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తాం. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అడ్వాన్స్‌ గదుల బుకింగ్‌ నిలిపివేస్తున్నాం. సీఆర్‌వో వద్దనే భక్తులకు గదులు కేటాయించేలా అన్ని ఏర్పాటు చేస్తాం” అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.