Politics

మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. రెండో స్థానానికి చైనా.

మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. రెండో స్థానానికి చైనా.

ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదంటే టక్కున చెప్పే సమాధానం చైనా అని.. కానీ ఇప్పుడు గర్వంగా మనమే అనే చెప్పుకునే రోజు త్వరలోనే రానుంది.మరో నాలుగు నెలల్లో జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి ప్రపంచ నం.1గా అవతరించనుంది. ప్రస్తుతం చైనా జనాభా 141.5కోట్లు. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో మూడో వంతు జనాభా చైనాలోనే ఉన్నారు. 2023ఏప్రిల్ నాటికి భారత్ జనాభా చైనాను అధిగమిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత భారత జనాభా 139కోట్లుగా ఉంది. ఇటీవల చైనాలో జననాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతేడాదిలో కేవలం 1.60కోట్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఆ దేశ మృతుల సంఖ్యతో పోల్చితే పెద్ద సంఖ్యేమీకాదు. ఇటు భారత్‌లోనూ అదే పరిస్థితి. 1950లో భారత సంతానోత్పత్తి రేటు సగటున 5.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెండుకు తగ్గింది.ఇక 1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతం ఉంది. అంటే జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది. కొరియా, మలేసియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌ వంటి తూర్పు ఆసియా దేశాలు, భారత్‌ కంటే ఆలస్యంగా జనాభా నియంత్రణ చేపట్టినప్పటికీ భారత్‌ కంటే ముందుగా సంతానోత్పత్తి స్థాయి తగ్గించడంతో పాటు, మాతాశిశు మరణాల రేటు తగ్గుదల, ఆదాయాల పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించాయి. ఐతే కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. తాజాగా మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో జననాలు మునుపటి కంటే తగ్గటానికి దోహదపడ్డాయి. అలాగే ప్రపంచంలో 25 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ అయిదుగురిలో ఒకరు భారతీయు కావడం విశేషం. మన దేశ మొత్తం జనాభాలో 47 శాతం జనాభా
25 ఏళ్లలోపు వారే ఉన్నారు. 1947లో భారతదేశ ప్రజల సగటు వయస్సు 21 సంవత్సరాలుగా ఉండిరది. ఆ సమయంలో 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు భారత దేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలకు పైగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 10 శాతంగా ఉంది.