DailyDose

కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత.

కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత.

తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఇటీవల యూనివర్సిటీ వీసీ బంగ్లాలో ప్రవేశించిన చిరుత ఓ కుక్కను ఎత్తుకెళ్ళి చంపి తినడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రి మళ్లీ మూడు చిరుత పులులు విద్యార్థినిల హాస్టల్ సమీపంలో సంచరించినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తాము హాస్టల్లో ఉండలేమంటూ యూనివర్సిటీ వీసి భవనం వద్ద ధర్నా నిర్వహించారు.దీంతో రంగంలోకి దిగిన వర్శిటీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ తిరగొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చిరుత కోసం రెండు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను ట్రాప్ చేసేందుకు బోనులో కుక్కను ఎరగా వేశారు. వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలల్లోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం చిరుతపులి అటవీశాఖ అధికారుల బోనుకు చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వదిలిపెట్టారు.గతంలో కూడా వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు సంచరించాయని స్థానికులు చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయి. వర్శిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గర చిరుత కుక్కలపై దాడి చేయగా.. అప్పట్లో సీసీ ఫుటేజ్ వైరల్ అయ్యింది.