కేసీఆర్తో కలిసి ప్రత్యేక పూజలు
యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్ సహా జాతీయ నేతలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్తో పాటు కేజ్రీవాల్, భగవంత్మాన్సింగ్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా ఇతర నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, నేతలకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అంతకుముందు ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన విందులో అతిథులు పాల్గొన్నారు.
దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేలా జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, కేజ్రీవాల్, భగవంత్మాన్ సింగ్, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రే హైదరాబాద్కు విచ్చేసిన వీరంతా ఉదయం ప్రగతిభవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో విశిష్ట అతిథులు పాల్గొన్నారు. విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు. విందు అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లలో ముఖ్యమంత్రులు, ఇతర నేతలు యాదాద్రికి వెళ్లారు. యాదాద్రి చేరుకున్న నేతలంతా నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్లకు చేరుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కేసీఆర్ సహా కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను నేతలకు అందజేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన నేతలకు అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
భారీ మెనూ సిద్ధం : యాదాద్రి పర్యటన అనంతరం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు. అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం, కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టరేట్లోనే భోజనం చేయనున్నారు. అతిథుల భోజనం కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల మాంసాహార, 21 రకాల శాకాహార వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు