DailyDose

ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ రాజధాని ఏది అంటే ఏం చెబుతారు ?

ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ రాజధాని ఏది అంటే ఏం చెబుతారు ?

మీ రాజధాని ఏది ? అనే పేరుతో చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక రాజధాని అమరావతి. ఈ విషయాన్ని ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ప్రకటించదు. కానీ అధికార పార్టీ నేతలు,.. స్వయంగా మంత్రులు కూడా ఎప్పుడైనా విశాఖకు పాలనా రాజధాని అని ప్రకటనలు చేస్తూంటారు. కానీ ఎన్నో చట్టపరమైన ఇబ్బందులున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తమ రాజధాని ఏదో స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చింది. అదే పెట్టుబడిదారుల సదస్సు.

మార్చిలో ఏపీ ప్రభుత్వం విశాఖలో ఇన్వెస్టర్స్ మీట్ జరపడానికి సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడిదారుల సదస్సుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మందిని ఆహ్వానిస్తోంది. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్.. ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌లను కూడా అహ్వానించినట్లుగా మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఎంత మంది వస్తారో తెలియదు కానీ.. వచ్చిన వారంతా మీ రాజధాని ఏది అని అడగడం సహజం. ఎందుకంటే ఏ రాష్ట్రానికి..లేదా దేశానికి అయినా రాజధాని కీలకం. రాజధానిగా అమరావతిని అధికారికంగా వారికి చెప్పలేరు. అలాగని.. తమ విధానం మూడు రాజధానులు అని చెప్పలేరు. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై క్లారిటీకి రాలేకపోతోంది. ప్రపంచ ఇన్వెస్టర్లకు రాజధాని విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది.

విశాఖ ఒక్కటే రాజధాని అని ప్రకటించే ఆలోచన చేస్తున్నారా ?

విశాఖ ఏపీలో ఉన్న భారీ పట్టణం. ఏపీలోనే కాదు.. విశాఖకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే.. విశాఖనే రాజధానిగా పెట్టుబడిదారులకు క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే విశాఖ ఒకటే రాజధాని అని ప్రకటించాలంటే అనేక చట్టబద్ధమైన సమస్యలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారన్నది ఇప్పుడు కీలకం. జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ ఉంది. 261మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారి వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించలేరు. అధికారికంగా ప్రకటన చేయలేరు. కానీ జనవరి 31న స్టే వస్తుందని.. వైసీపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అందుకే విశాఖ రాజధానిగా ప్రకటన ఉంటుందని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు.

చట్టబద్దంగా సాధ్యమవుతుందా ?

ఒక వేళ స్టే రాకపోయినా సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చని.. రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రానిదే కాబట్టి.. ఆ అధికారాన్ని ఉపయోగించుకుని తాము వెళ్లిపోతున్నామని ప్రభుత్వం ప్రకటించుకోవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. అమరావతి ప్రాజెక్ట్ నుంచి ప్రభుత్వం తప్పుకుంటే రైతులకు పరిహారం చెల్లించాల్సి రావొచ్చు. ఇటీవల మంద్రి ధర్మాన ప్రసాదరావు విశాఖను రాజధానిగా చేయకపోతే ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా ఈ కోణంలోనే వ్యూహాత్మకంగా చేస్తున్నారని తాజా పరిణామాలతో ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే నిజం అయితే.. ఇన్వెస్టర్స్ మీట్ కు ముందు విశాఖ రాజధాని ప్రకటన రావొచ్చు. కానీ అది చట్ట పరంగా .. న్యాయపరంగా అనేక వివాదాలకు గురవుతుంది. అదే జరిగితే.. పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం సన్నగిల్లుతుంది. అప్పుడు వ్రతం చెడుతుంది.. ఫలం దక్కదు. మరి ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది ?