Movies

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత..

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత..

హైదరాబాద్ : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్‌ అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కె.విశ్వనాథ్ పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు.

1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటాడు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్‌ వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్‌ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.