Politics

ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు

ఘాటు ఘాటుగా విమర్శలు.. ప్రతి విమర్శలు

Hyderabad : తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

నేటి అసెంబ్లీలో అదే జరిగింది. మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడిచింది. సభా నాయకుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై అక్బరుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఇలాంటి సభను తన 25 ఏళ్లలో ఏనాడూ చూడలేదు. బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్‌లకు వెళ్లే టైం ఉంటుంది కానీ సభకు వచ్చే టైం లేదా? అని ఎద్దేవా చేశారు. సభా నాయకుడితో సంబంధమేంటని కేటీఆర్ ప్రశ్నించారు.

అసలు అక్బరుద్దీన్ సభలో ఏమన్నారంటే..

హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేంటి ? ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే. బీఏసీ (BAC)లో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. టీవీ చర్చలకు వెళ్లే బీఆర్ఎస్ నేతల (BRS Leaders)కు సభకు వచ్చే తీరిక లేదా?

కేటీఆర్ కౌంటర్..

మంత్రులు అందుబాటులో లేరన్నది అవాస్తవం. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదు. సభ్యులను బట్టి పార్టీలకు సమయం కేటాయిస్తాం. బీఏసీకి రాకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆవేశంగా మాట్లాడటం కాదు.. అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?

అక్బరుద్దీన్ ఓవైసీ..

నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా. టైంను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.