ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్తో పాటు ఏఈఈ(AEE ), డీఏవో( DAO ) ఎగ్జామ్స్ను కూడా రద్దు చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నాపత్రాల లీకేజీల దృష్ట్యా టీఎస్పీఎస్సీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఏఈ, టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ -1 ప్రిలిమ్స్ను గతేడాది అక్టోబర్ 16న నిర్వహించగా, ఏఈఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న, డీఏవో ఎగ్జామ్ను ఫిబ్రవరి 26న నిర్వహించారు. ఇవాళ ఉదయం టీఎస్పీఎస్సీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1, ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్పీఎస్సీ.