WorldWonders

హంతకులను పట్టించిన చిలుక

హంతకులను పట్టించిన చిలుక

ఓ చిలుక తన యజమానిని హత్య చేసిన నిందితులను పోలీసులకు పట్టించడంలో సాయపడింది. యజమాని చనిపోయిన ఆరునెలలకు బెంగతో అదీ చనిపోయింది.

ఆగ్రా : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ హత్య కేసులో 9 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడింది. తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను కోర్టు దోషిగా తెల్చింది. ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఇక్కడ కీలకంగా మారింది. ఈ మేరకు పోలీసులు సమర్పించిన చార్జిషీట్ ఆధారంగా కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, కేసు ఏదైనా కానీ సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం మామూలే కదా అనిపిస్తుంది.. కానీ వాంగ్మూలం ఇచ్చిన సాక్షి గురించి వింటే ముక్కున వేలేసుకుంటారు.. అలాంటి సాక్ష్యం కూడా చెల్లుతుందా? అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ.. 9 ఏళ్ల తర్వాత నిందితురాలిగా ఉన్న ఆమెకి శిక్ష పడడానికి కారణమైన ఆ సాక్షి ఎవరంటే ఓ చిలుక.

ఆ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో కాదు.. పోలీసుల విచారణలో నిందితులను గుర్తించేందుకు చిలుక సహాయపడింది. పెంపుడు జంతువులు యజమానుల పాలిట ఎంత విశ్వాసంగా ఉంటాయో.. వాటికి కాసింత ప్రేమను అందింస్తే ఎలాంటి విశ్వాసాన్ని కురిపిస్తాయో ఈ ఘటన నిరూపిస్తుంది. ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… 2014 ఫిబ్రవరి 20న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ భార్య.. నీలమ్ శర్మ తమ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన నిందితులు ఆమెను, ఆమె పెంపుడు కుక్కను కూడా అనేకసార్లు పదునైన ఆయుధంతో పొడిచి.. దారుణంగా హత్య చేశారని పోస్ట్ మార్టంలో తేలింది.

ఆ సమయంలో ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా భావించి విచారించారు. అయితే, సరైన సాక్షాధారాలు దొరకలేదు. దీంతో ఆ కేసు అలాగే పెండింగ్లో ఉండిపోయింది. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు హత్య జరిగిన రోజు నుంచి విజయ్ శర్మ పెంపుడు చిలక అన్యమనస్కంగా ఉంటుంది. సరిగా తినడం లేదు. అయితే, విజయ్ శర్మకు అషు అనే మేనకోడలు ఉంది. ఆమె అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చేది. నీలమ్ శర్మ హత్య జరిగిన తరువాత ఎప్పుడు అషు వచ్చినా… ఆమెను చూసి చిలుక విపరీతంగా అరుస్తుండేది. దీంతో విజయ్ శర్మకు చిలక ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. నీలంను హత్య చేసిన నిందితులను చిలక చూసిందేమో అని సందేహించాడు. ఈ విషయాన్ని విజయ్ శర్మ పోలీసులకు తెలిపాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గతంలో అనుమానితులుగా ఉన్నవారితో పాటు అషును కూడా పోలీసులు చిలకముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలక ఆమెను చూసి విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో విజయ్ శర్మ అనుమానం, పోలీసుల సందేహం తీరినట్లు అయింది. వెంటనే అషును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా ఆమె అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. డబ్బు, నగలకోసం నీలం శర్మను.. రోన్ని అనే వ్యక్తితో కలిసి తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. ఈ మేరకు పోలీసులు ఛార్జి షీట్ తయారు చేశారు. అయితే, ఈ చార్జిషీట్లో పోలీసులు చిలక వాంగ్మూలాన్ని ప్రస్తావించలేదు. చిలకను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత సదరు చిలుక చనిపోయింది. కాగా 9 ఏళ్ల తర్వాత తాజాగా ప్రస్తుతం ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులు ఇద్దరికీ జీవిత ఖైదు విధించారు.