Politics

హైకోర్టు ముందు దారుణ హత్య*

హైకోర్టు ముందు  దారుణ హత్య*

నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి
రూ. పది వేల కోసం గొడవ.. కోపం పట్టలేక దారుణం
పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన హంతకుడు

హైదరాబాద్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు ముందు నడి రోడ్డుపై హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ దారుణానికి దారితీసింది. అనంతరం హంతకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. రూ.10 వేల కోసం గొడవ జరగడంతో కోపం పట్టలేక పొడిచానని పోలీసులకు చెప్పాడు.

చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. రూ.10 వేల కోసం వాదులాడుకున్నారు. మాటామాటా పెరగడంతో.. ఓ వ్యక్తి కోపం పట్టలేక కత్తి తీసి మరొకరిని పొడిచాడు. కత్తిపోట్లకు గురైన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని స్థానిక సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే మిథున్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.