Business

డీజిల్‌ వాహనాలను నిషేధించండి….

డీజిల్‌ వాహనాలను నిషేధించండి….

డీజిల్‌ వాహనాల వినియోగానికి సంబంధించి కేంద్రానికి ఓ కమిటీ కీలక నివేదిక సమర్పించింది. డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించాలని ఆ కమిటీ సూచించింది.

దిల్లీ: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక సూచన చేసింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజిల్‌ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. వాటి స్థానంలో విద్యుత్‌, గ్యాస్‌ ఆధారిత వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే 2035 నాటికి సంప్రదాయ ఇంజిన్లతో నడిచే మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాలను సైతం దశలవారీగా తప్పించాలని సూచించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నేతృత్వంలోని కమిటీ ఓ నివేదికను సమర్పించింది. ఫిబ్రవరిలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి చేరినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

2035 నాటికి మండే ఇంజిన్లతో నడిచే టూవీలర్‌/ త్రీ వీలర్‌ వాహనాలను దశలవారీగా తొలగించడం కోసం విద్యుత్‌ వాహనాలు ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఈలోగా చమురులో ఇథనాల్‌ను కలిపే వాటాను పెంచాలని సూచించింది. ఫోర్‌ వీలర్ల విషయానికొస్తే.. ప్యాసింజర్‌ కార్లు సహా, ట్యాక్సీల్లో సగం వాహనాలను ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో నడిపే విధంగానూ.. మిగిలిన 50 శాతం విద్యుత్‌ వాహనాలుగానూ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పింది. డీజిల్‌తో నడిచే వాహనాలను వీలైనంత త్వరగా తప్పించాలని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 2027 నాటికి 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో వీటిపై నిషేధం విధించాలని నివేదిక అభిప్రాయపడింది. ఈవీలకు మారే వరకు సీఎన్‌జీ ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది. ఫేమ్‌ సబ్సిడీ పొడిగింపునూ పరిశీలించాలని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

2070 నాటికి నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించడమే భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో ప్రస్తుతం చైనా, అమెరికా, ఈయూ తొలి మూడు స్థానాల్లో ఉండగా.. భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. కర్బన ఉద్గార రహితంగా మారే క్రమంలో 2030 నాటికి దేశంలో వినియోగించే మొత్తం ఇందనంలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది…