NRI-NRT

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో ప్రవాస భారతీయులు భేటీ…

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో  ప్రవాస భారతీయులు  భేటీ…

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మంగళవారం భారత రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండేను పలు ప్రవాస భారతీయ సంఘాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మాతృదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు పొందడంపై విస్తృత స్థాయి చర్చ జరిగింది.

ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవాసుల పాత్రపై పలు నిర్మాణాత్మక అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్లు, పలుదేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో ప్రవాసులు ఓటు వేసే అవకాశం కల్పించే దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల పెద్దల ఆలోచనలు, అభిప్రాయాలను ఎన్నికల కమిషన్‌ సభ్యులు నమోదు చేసుకున్నారు. ఓటు హక్కు కల్పించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చర్చించి ఆమోదయోగ్యమైన పరిస్థితులను అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ఎన్‌సీఏఐ అధ్యక్షులు సునీల్ సింగ్, పలు భారతీయ ప్రవాస సంఘాల పెద్దలు, క్రాంతి దూదం, భాను ప్రకాష్ మాగులూరి, మల్లికార్జున్ బొరుగు తదితరులు పాల్గొని భారత చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అనూప్ చంద్ర పాండేను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.