WorldWonders

హనుమకొండలో ప్రత్యేక పూజలు..

హనుమకొండలో ప్రత్యేక పూజలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత సెగలు పుట్టిస్తోంది. దీంతో ‘శాంతించు సూర్యదేవా’ అని కోరుకుంటూ పలువురు బాబాలు, అధికారులు హోమాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. హనుమకొండ బాలసముద్రంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో రుద్ర హోమం నిర్వహించారు. ఉద‌యం 10 త‌ర్వాత బ‌య‌ట‌కు రావాలంటేనే ప్రజ‌లు భ‌య‌ప‌డి పోతున్నారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. సూర్యాస్తమయం తరువాత కూడా వేడి తగ్గట్లేదంటే పగటి ఉష్ణోగ్రత తీవ్రత ఏ స్థాయింలో ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటుతోంది. వడగాలులు దీనికి తోడయ్యాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మాడు పగిలేలా ఉన్న ఎండల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మరోవైపు ప్రజలు కూడా ‘ఇవేం ఎండలు బాబోయ్’ అని బెంబేలెత్తిపోతున్నారు. ఎండ దెబ్బకు మాడి మసి అవుతున్నారు. ఉక్కపోత‌తో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూగ జీవులు వేసవి తాపంతో అల్లాడుతున్నాయి. దీంతో ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందెందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో జనం భగవంతుడి పై భారం వేశారు. సూర్య భానుడు శాంతించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్ర హోమం నిర్వహించి లోక శాంతి కోరుకున్నారు.

వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండలను తగ్గించాలని స్థానిక భక్తులు దేవుడికి మొక్కుకున్నారు. మనుషులకు, పశుపక్షాదులకు, జంతువులకు ఆకలి దప్పుల వైపరీత్యం ఎక్కువగా కలిగే అవకాశం ఉందని.. అందుకే ఎండ వేడి తగ్గాలని కోరుతూ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎండలు ఉన్నన్ని రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బయటికి వెళ్లకుండా, తప్పని పరిస్థితుల్లో వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు.