NRI-NRT

పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం…

పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం…

జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే 21 ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు.  విమానం దిగి వస్తున్న మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు.  దీంతో మోడీ ఆయన్ను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు.

అనంతరం మోడీకి ఇతర అధికారులకు ఆయన పరిచయం చేశారు. పపువా న్యూ గినియాను సందర్శించిన భారత తొలి  ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం.  పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు కూడా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారు మోడీతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు  వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది, కానీ ప్రధాని మోడీ కోసం ఈ దేశం తన సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం రాత్రిపూట ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు. కానీ భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోడీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు వచ్చారు. ఈ సమావేశంలో 14 దేశాల నేతలు పాల్గొంటారు. పపువా న్యూ గినియాలో పర్యటించిన అనంతరం ప్రధాని మోడీ  ఇక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.