Politics

కర్ణాటక మంత్రుల్లో 24 మందిపై క్రిమినల్ కేసులు…

కర్ణాటక మంత్రుల్లో 24 మందిపై క్రిమినల్ కేసులు…

కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని 34 మంది మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే. ఇందులో 24 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం మంత్రుల్లో 97 శాతం మంది కోటీశ్వరులని తెలిపింది. వారి సగటు ఆస్తుల విలువ రూ.119.06 కోట్లుగా పేర్కొంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యధికంగా రూ.1,413.80 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. ముధోల్ (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన మంత్రి తిమ్మాపూర్ రామప్ప బాలప్పకు రూ.58.56 లక్షల కనీస ఆస్తులున్నాయని పేర్కొంది. అలాగే సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి, బెల్గాం నియోజకవర్గానికి చెందిన లక్ష్మీ ఆర్.హెబ్బాల్కర్‌కు రూ.13 కోట్ల ఆస్తులు, రూ.5 కోట్ల అప్పులున్నాయని వెల్లడించింది.

కాగా, కర్ణాటక మంత్రుల్లో 24 మంది (75 శాతం) గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఇద్దరు మంత్రులు డిప్లొమా హోల్డర్లు. ఆరుగురు మంత్రులు (19 శాతం) మాత్రం ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి పాస్ అయ్యారని ఏడీఆర్‌ తెలిపింది. అలాగే 18 మంది మంత్రులు (56 శాతం) 41 నుంచి 60 ఏళ్ల వయస్కులని పేర్కొంది. 14 మంది మంత్రుల (44 శాతం) వయసు 61 నుంచి 80గా తెలిపింది. కర్ణాటక మంత్రులు ఎన్నికల అఫిడవిట్‌లో ఈ మేరకు తమ వివరాలు పేర్కొన్నట్లు ఏడీఆర్‌ వెల్లడించింది.