ఆర్టీసీ బస్సును అపహరించి యాధావిధిగా బస్సును నడిపి ప్రయాణికుల నుంచి డబ్బును కొల్లగొట్టాలని చూసిన దొంగకు అత్యాశే మిగిలింది. ఈ ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. సీఐ కృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో స్వామి అనే వ్యక్తి అద్దె బస్సును నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఆర్టీసీ డిపో ముందున్న రోడ్డుపైన బస్సును డ్రైవర్ నిలిపి వెళ్లాడు. అయితే బస్సు డ్రైవర్ బస్సు కీస్ను మరిచాడు. ఇదే అదునుగా భావించిన దుండగుడు రాజు బస్సును అపహరించుకెళ్లాడు. ఇక సిరిసిల్ల నుంచి జేబీఎస్ బోర్డును తగిలించి బస్సును నడిపించాలని రాజు ప్లాన్ చేశాడు. ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.. కాని టికెట్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి రాజును నిలదీశారు. అదే సమయంలో బస్సులో డీజిల్ అయిపోవడంతో రాజు బస్సును అక్కడే వదిలి పారిపోయాడు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా.. బస్సు యజమానికి తెలిపారు. బాధితుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు మోదు చేశామని సీఐ వివరించారు. బస్సు అపహరించింది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్కు చెందిన బందెల రాజుగా గుర్తించి అతని అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ కస్టడీకి తరలించామన్నారు.
సిద్దిపేట ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగుడు

Related tags :