రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ధారపోస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రకటించిన ఏడు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసేలా ఇంఛార్జిలు, సమన్వయకర్తల్ని నియమించింది. ‘కాంగ్రెస్ గ్యారంటీ యాత్ర’ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి వీటిని ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సుఖ్జిందర్ సింగ్ రాండ్వా పేర్కొన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని ఉదయ్పుర్ ఇంఛార్జిగా నియమించగా.. అజ్మేర్కు సచిన్పైలట్, జోధ్పుర్కు హరీశ్ చౌధురి, బికనేర్కు గోవింద్రామ్ మేఘ్వాల్, జైపుర్కు భన్వర్ జితేంద్ర సింగ్, భరత్పుర్కు మోహన్ ప్రకాశ్, అంటాకు ప్రమోద్ జైన్ భయాను నియమించారు. అలాగే, కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు కాజీ నజిముద్దీన్, వీరేంద్రసింగ్ రాథోడ్, అమృత ధావన్లను సమన్వయకర్తలుగా నియమించినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ ఎన్నికల కోసం అశోక్ గహ్లోత్ ఏడు హామీలు ప్రకటించింది. మళ్లీ తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే.. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్/ట్యాబ్లు, ప్రతి విద్యార్థికీ ఇంగ్లిష్ మీడియం చదువు, ఇంట్లో ఇల్లాలికి ఏడాదికి రూ.10వేలు గౌరవవేతనం సహా మొత్తం ఏడు ప్రజాకర్షక హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –