* ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) అన్నారు. ఇది దేశ సాంకేతిక స్వావలంబనలో కీలక ముందడుగుకు గుర్తుగా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులు, మేడిన్ ఇండియా చిప్ గురించి ప్రస్తావించారు. సెమీ కండక్టర్ల (semiconductor) విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇటీవల భారత దేశం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.13,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం 234 విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 1.0 పూర్తి చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. అయితే మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్ ఆధునికీకరణ ఇంకా పెండింగ్లోనే ఉందన్నా ఆయన.. ఇది పూర్తయ్యాక ISM 2.0 కోసం పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు.
* దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ ఎల్జీ కార్ప్ ఛైర్మన్ క్వాంగ్ మో కూ ఈ నెల 24న మనదేశ పర్యటనకు రానున్నారు. ఎల్జీ కార్ప్ దేశీయ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రణాళికను ఖరారు చేయడంతో పాటు ఇక్కడ డిస్ప్లే, పరికరాల తయారీ రంగంలో తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించడానికి ఈ పర్యటనను ఆయన వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. మొత్తం ఎల్జీ వ్యాపారాలకు మాతృసంస్థగా ఉన్న ఎల్జీ కార్ప్ ఛైర్మన్, దశాబ్దం తర్వాత భారత పర్యటనకు రానున్నారు.
* కొత్త ఏడాదిలో ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే రూ.లక్ష కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో అమ్మేశారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) డేటా ప్రకారం, ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఈ ఏడాదిలో ఇప్పటివరకు నికరంగా రూ.99,299 కోట్లను మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఎఫ్పీఐల అమ్మకాల ఒత్తిడి ఈ నెలలో కూడా కొనసాగింది. ఈ నెల 10 నుంచి 14 మధ్య నికరంగా రూ.13,930 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దీంతో కలిపి ఈ నెలలో ఇప్పటివరకు రూ.21,272 కోట్లను మార్కెట్ నుంచి ఎఫ్పీఐలు విత్డ్రా చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నికరంగా రూ.78,027 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. కిందటేడాది డిసెంబర్లో నికరంగా రూ.15,446 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు, కొత్త ఏడాదిలో మాత్రం నికర అమ్మకందారులుగా మారారు.
* 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి 500 బిలియన్ డాలర్ల (రూ.43.50 లక్షల కోట్ల) కు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. అమెరికా నుంచి క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ను భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుందని అంటున్నారు. టెక్నాలజీ, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీపై శ్రద్ధ చూపాలని నిర్ణయించడం వల్ల ఇండియా ఎగుమతి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగా మన పోటీతత్వం మరింత పెరుగుతుంది. ద్వైపాక్షిక వ్యాపారానికి గల అడ్డంకులను తొలగించి అంతా సజావుగా నడిచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ఎక్స్పోర్ట్ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్అశ్వనీ కుమార్అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z