🕑 Published: March 24, 2026 at 12:33 PM CST
టోరంటోలోని తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(TACA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలను శనివారం నాడు టోరంటో పెవిలియన్లో వైభవంగా నిర్వహించారు. ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఉత్సాహంగా ఆస్వాదించారు. టోరంటోలోని భారత కాన్సుల్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి మల్లికార్జున చారి స్వాగతోపన్యాసం, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేద పండితులు మంజునాథ్ పంచాంగ శ్రవణం నిర్వహించారు.
100 మందికి పైగా కళాకారులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులను తాకా జ్ఞాపికలతో సత్కరించారు. తెలుగు వంటకాలు ఏర్పాటు చేసి నేతి బూరెలు వడ్డించారు. గ్రాండ్ స్పాన్సర్లు ప్రవీణ్ చిమట, గౌతమ్ కొల్లూరిలకు సంస్థ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.
తాకా అధ్యక్షురాలు ప్రసన్న తిరుచిరాపల్లి అతిథులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు వాణి జయంతి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు అశ్విత, ప్రశాంతి, యశ్వంత్, కళ్యాణ్, వ్యవస్థాపక అధ్యక్షుడు చారి సామంతపూడి, BOT ఛైర్ కల్పన మోటూరి, ట్రస్టీలు అనిత సజ్జ, ప్రవీణ్ పెనుబాక, పవన్ కుమార్ బసాని, ఆదిత్య వర్మ, మాజీ అధ్యక్షుడు రమేష్ మునుకుంట్ల, సంస్థాపక సభ్యులు రామ్ దుగ్గిన, మునాఫ్ అబ్దుల్, అరుణ్ కుమార్ లయం తదితరులు పాల్గొన్నారు.




