🕑 Published: July 18, 2026 at 10:10 AM CST
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం నాలుగో రోజు అత్యంత వైభవంగా జరిగింది. గోమాత పూజ, మహన్యాస పారాయణం, రుద్రహోమం, సుదర్శనహోమం, చండీ పారాయణ, చండీ హోమం, పవిత్రమైన శక్తివంతమైన ప్రత్యంగిరా హోమం నిర్వహించారు.
భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక సహస్ర కుంకుమార్చన ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. మహిళలు ఎరుపు రంగు చీరలు ధరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆలయ కమిటీ అందజేసిన పూజా సామాగ్రితో కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షను కూడా ప్రసాదంగా అందజేశారు. శ్రీచక్రం అద్భుతమైన అలంకరణతో ప్రాంగణమంతా దివ్యత చోటుచేసుకుంది. నవదుర్గాదేవి పూజ చేసి ఋత్విక్కులు మరియు హిందూ టెంపుల్ కలిసి ఇంత భారీ సంఖ్యలో అద్భుతంగా ఉత్తర అమెరికాలో తొలిసారిగా సామూహిక సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఫుడ్ కమిటీ అధ్యక్షురాలు పల్లవి సూరపనేని, రాజేష్ ఏవూరి, సతీష్ లంక నేతృత్వంలోని కమిటీ సభ్యులు 4000 మందికి ప్రసాదాలు తయారు చేశారు. ఆదివారంతో ముగియనున్న ఈ వేడుకల్లో ప్రవాస భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనవల్సిందిగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని తదితరులు కోరారు.













