🕑 Published: August 01, 2026 at 09:07 AM CST
* బే ఏరియాలో బంతి భోజనాలు
* నేడు తెలుగు సాంస్కృతిక వైభవం
* కాలిఫోర్నియాలోని ఓక్ల్యాండ్ ఎరీనా సిద్ధం
సిలికానాంధ్ర సంస్థ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలిఫోర్నియాలోని ఓక్ల్యాండ్లో రజతోత్సవ సంబరాలను శనివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో పాటు సిలికానాంధ్ర సంస్థ సుదీర్ఘ ప్రయాణంలో సంస్థకు సహకరించిన దాతలను శుక్రవారం నిర్వహించిన బ్యాంక్వెట్ విందు కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ సిలికానాంధ్ర జగమంత కుటుంబంలో సభ్యులే బలం, మూలం అని కొనియాడారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల స్ఫూర్తిని బలోపేతం చేస్తూ విశ్వవ్యాప్తం చేయడంలో అందరి పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. అనంతరం దాతలను, గురువులను, సిలికానాంధ్ర సంస్థ స్వచ్ఛంద సేవకులను రాజ్యసభ మాజీ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పొన్నల లక్ష్మయ్య, జొన్నవిత్తుల, గుమ్మడి గోపాలకృష్ణ, డా. లకిరెడ్డి హనిమిరెడ్డిలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ సిలికానాంధ్ర కోసం త్రివర్ణంలో చేయించిన ప్రత్యేక శాలువాలతో ఆనంద్ సత్కరించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర అధ్యక్షురాలు తనుగుల ప్రియా, ప్రతినిధులు దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, శ్రీరాం కోట్నీ, కొండా శాంతి, కూచిభొట్ల శాంతి, జయంతి కోట్ని, శివ పరిమి, రాయవరం విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
* అమెరికా అరిటాకులు...బే-ఏరియా బంతి భోజనాలు
బే-ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభలో వైవిధ్యంగా బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. సిలికానాంధ్ర సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అతిథులకు తెలుగింటి భోజనం సహజమైన అరిటాకుల్లో వడ్డించారు. శనివారం జరగనున్న కార్యక్రమాల్లో పలు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మరిన్ని వివరాలకు - https://silverjubilee.siliconandhra.org/ చూడవచ్చు.







