ScienceAndTech

భారతదేశంలో గూగుల్‌పేపై నీలినీడలు

petition against google pay in delhi high court

‘గూగుల్‌ పే’.. ఈ పేమెంట్‌ యాప్‌ గురించి తెలియని వారుండరు. అయితే ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో గూగుల్‌ పే అధికారికమేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్‌ పే యాప్‌పై అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక.. ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో గూగుల్‌ పే పేరు లేదని వెల్లడించారు. మిశ్రా పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్‌ పే యాప్‌ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్‌బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్‌ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.