Business

రాజకీయ పార్టీలకు ₹220కోట్లు ధారపోసిన టీసీఎస్

tcs donates 220crores to political parties

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఈ ఏడాది రాజకీయ పార్టీలకు భూరి విరాళం ఇచ్చింది. జనవరి – మార్చి త్రైమాసికంలో రూ. 220కోట్లను ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు అందించింది. టీసీఎస్‌ ఇంత భారీ స్థాయిలో ఎన్నికలకు విరాళాలు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను టీసీఎస్‌ శుక్రవారం వెల్లడించింది. ఆదాయ వ్యయాల్లో ఇతర ఖర్చుల కింద రూ. 220కోట్లను ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొత్తం ఏయే రాజకీయ పార్టీలకు అందిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. టీసీఎస్‌ సహా టాటా గ్రూప్‌కు చెందిన కంపెనీలు గతంలోనూ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌లకు విరాళాలు ఇచ్చాయి. 2013లో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రొగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఏర్పాటైంది. ఈ ట్రస్ట్‌కు టీసీఎస్‌ నిధులు ఇచ్చింది. 2013, ఏప్రిల్‌ 1 నుంచి 2016 మార్చి 31 వరకు ప్రొగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు నిధులు పొందాయి. ఆ సమయంలో టీసీఎస్‌ కేవలం రూ. 1.5కోట్లు మాత్రమే విరాళాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రొగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఈసీకి అందించిన తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ ట్రస్ట్‌ ఏ రాజకీయ పార్టీకి నిధులు ఇవ్వలేదు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఏయే పార్టీలకు ఇచ్చిందనే విషయంపై మాత్రం వివరాలు తెలియలేదు. దేశంలో అనేక ఎలక్టోరల్‌ ట్రస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కార్పొరేట్లకు, రాజకీయ పార్టీలకు మధ్యవర్తులుగా ఉంటాయి. వీటిలో ప్రుటెండ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ అతి పెద్దది. ఈ ట్రస్ట్‌కు భారతీ గ్రూప్‌, డీఎల్‌ఎఫ్‌ భారీగా విరాళాలు ఇస్తుంటాయి. ఈ విరాళాల్లో ఎక్కువ మొత్తం భారతీయ జనతా పార్టీకే వెళ్లున్నాయి.