Business

SBI నీకు సిగ్గుందా? – మాల్యా చురకలు!

vijay malya public shames SBI for spending tax payers money

గత కొంతకాలంగా ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీతో సహా పలువురిపై విమర్శలు గుప్పిస్తున్న ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యా ఈసారి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)పై విమర్శనాస్త్రాలు సంధించారు. తనను భారత్‌కు రప్పించడానికి ఎస్‌బీఐ లాయర్ల కోసం ఎంత ఖర్చు పెడుతోందో తెలుసా? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. లండన్‌లోని బ్యాంకులో ఉన్న సుమారు 260, 000 పౌండ్లను మాల్యా వినియోగించుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం యూకే హైకోర్టును ఆశ్రయించగా, అది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా తన వ్యాఖ్యలకు పదును పెంచారు. ‘భారత్‌లో పన్నులు చెల్లిస్తున్న వారి సొమ్ముతో ఎస్‌బీఐ న్యాయవాదులు ఇక్కడ నాకు వ్యతిరేకంగా ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. భారతీయుల సొమ్ముతో ఎస్‌బీఐ లాయర్లు యూకేలో తమకు తాము ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి ఎస్‌బీఐ సమాధానం చెప్పి తీరాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మీడియాకు సెన్సేనల్‌ న్యూస్‌ కావాలి. అయితే, ఎందుకు ఒక్కరూ కూడా ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేస్తున్న ఖర్చు గురించి సహ చట్టం ద్వారా వివరాలు తెలుసుకోవడం లేదు. ఆ వివరాలు, ఆ లెక్కలు కళ్లు చెదిరిపోయేలా ఉంటాయి’ అని మాల్యా అన్నారు. తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లిస్తానని ముందుకొచ్చినా వాళ్లు వినడం లేదని ఆరోపించారు.