Politics

18 ఏళ్లలో తిరుగులేని రాజకీయ శక్తిగా….

ktr in trs formation day celebrations

తెరాస 18వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. మే 23న వచ్చే ఫలితాల్లో తెరాస 16 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పనిచేసిన తెలంగాణవాదులందరికి శుభాకాంక్షలు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని.. ఆనాడు కేసీఆర్‌ మూడు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో దిగారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి, శాసన సభ సభ్యత్యానికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమానికి కేసీఆర్‌ పురుడు పోశారు. ఉద్యమం ప్రారంభించిన అనంతరం ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన ధైర్యం కేసీఆర్‌ది. ఉద్యమ తొలినాళ్లలో అన్ని ప్రతికూల పరిస్థితులే. 13 ఏళ్లు పోరాటం చేసి కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు. తక్కువ కాలంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించినందుకు కేసీఆర్‌ను నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. ఈ 18 ఏళ్లలో తిరుగులేని రాజకీయ శక్తిగా తెరాస ఎదిగింది’ అని కేటీఆర్‌ అన్నారు.