Politics

నాల్గో దశ పోలింగ్‌లో కూడా మొరాయించిన ఈవీఎంలు

evm issues persists in fourth phase of indian elections

బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల పరిధిలోని 72 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణగంజ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సోమవారం జోరుగా పోలింగ్‌ జరుతుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండగా, ఇంతకుముందు జరిగిన మూడు విడతల్లాగానే నేటి పోలింగ్‌లో కూడా అక్కడక్కడా ఈవీఎంలు మొండికేస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం ఒక్క కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసిపోతుండగా, మిగతా అన్ని చోట్ల సాయంత్రం ఆరు గంటలకు ముగిసిపోనుంది. ఏప్రిల్‌ 11న జరిగిన మొదటి విడత లోక్‌సభ పోలింగ్‌లో 69.5 శాతం పోలింగ్, ఏప్రిల్‌ 18న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 69.44 శాతం, మూడవ విడత పోలింగ్‌లో 67.99 శాతం పోలింగ్‌ నమోదయింది. మే 19 వరకు మరో మూడు విడత పోలింగ్‌ జరుగనుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. నాలుగో విడత ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడా చూసినా సరే ఉదయం నుంచే వారు బారులు కట్టి కనిపిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా పలు పార్టీలు, నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించడంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకున్నట్లయితే వారు కచ్చితంగా అనుకున్న పార్టీకి వేస్తారని, మగవారిలాగా వారిలో ఊగిసలాట ధోరణి ఉండదని వారి నమ్మకం.