DailyDose

TNI Morning Flash News-09/25

TNI Morning Flash News-09/25

* “సహభాష్ కోకనాడి” అనే కవి పేరు విన్నారా ఎప్పుడేనా? అది ఆయన అసలు పేరు కాదు.. కలం పేరు. ఆ కవికి ఆ కలం పేరు ఉందని తెలిసిన వారు బహు కొద్దిమందేనేమో! ఎనిమిది భాషలలో ఆ కవి రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, గద్య, పద్య, కవితా రచనలు చేశారు. పన్నెండు భాషలలో అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడు ఆయన. అందునా ఒక తెలుగు వాడు. ఆయన సొంత ఊరైన కాకినాడని తన కలంపేరుగా పెట్టుకొన్న మహా మనిషి, అమరగాయకుడు ” ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు” …. అందరికి సుపరిచయం.. “పి.బి. శ్రీనివాస్ ” అనే! ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడ, సంస్కృతం ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “సహభాష్ కోకనాడి ” అనే పేరుతో రాసేవారు. ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడలో 3000 లకు పైగా పాటలు పాడారు. ఆకలి రాజ్యం సినిమాలో “తూ హై రాజా మై హూ రాణి ” అనే హింది పాట వ్రాసింది పి.బి. శ్రీనివాస్ గారే! ఒకసారి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పి.బి. శ్రీనివాస్ గారి పాట విని ఆయన కుమారుడైన పావన శాస్త్రి గారితో ” ఈ పాట పాడిందెవరూ? ” అని అడిగారుట. “పి.బి. శ్రీనివాస్ అదే ప్రతివాద భయంకర శ్రీనివాస్ అని… ” అని ఆయన కుమారుడు జావాబివ్వగా “మగటిమి ఉన్న గాత్రం .. భలే ఉంది ” అని అన్నారుట ఆ గంభీర గాత్రాన్ని విని. “డైమాండ్ టి ” … అనే ప్రక్రియతో ఒక మేలకర్త రాగానికి ఆరోహణ, అవరోహణలు చెబుతూ ఆ రాగాన్ని సులువుగా గుర్తుపెట్టుకోగల నైపుణ్యాన్ని ఎందరో విద్యార్ధులకు భోధించారు పి.బి. శ్రీనివాస్ గారు. అలా 72 మేలకర్త రాగాలను సులువుగా గుర్తించ గల ప్రక్రియ కనిపెట్టింది వారే! ఆయన కొన్ని రాగాలను సృష్టించారు కూడా! ఆ రాగాలకు సాహిత్యం కూడా వారే రాసుకునేవారు. ఆయన మన సమకాలికులైన వాగ్గేయకారుడు. వారు ఎక్కడకు వెళ్ళినా ఆయన కారు నిండా పుస్తకాలతో నిండి ఉంటుంది. వారు ఏ సభలకు వెళ్ళినా ఒక చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకున్నట్టు ఆయన చేతిలో ఎప్పుడూ కనీసంలో కనీసం నాలుగైదు పుస్తకాలు ఉండేవి. ఆయన జీవితం లో పుస్తకాలకి అంతటి స్థానం ఉందన్న మాటా! వారి దగ్గర ఎక్కువ పుస్తకాలే కాదు… ఎక్కువ పెన్నులు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న “ఫౌంటేన్ పెన్నులు ” మరే రచయిత దగ్గరా లేవేమో! ఆయన ఎక్కువగా రాసుకునే చోటు “వుడ్ లాండ్స్ ” (డ్రైవ్ ఇన్) . అక్కడ వారికోసం ఒక బెంచి, కుర్చి ఆ “వుడ్ లాండ్స్ ” వారు ప్రత్యేకంగా ఉంచేవారుట. ఒకసారి భువనచంద్ర “ఇంత వరకు మీరు కన్నడా లో రాజ్ కుమార్ గారికి ఎక్కువ పాటలు పాడారు కదా… ఇప్పుడు ఆయన పాటలు ఆయనే పాడుకుంటున్నారు.. దాని మీద మీ స్పందన ఏంటీ?” అని అడుగగా…”అంత గొప్ప గాయకుడు ఏమాత్రమూ అతిశయోక్తి లేకుండా నాచేత పాడించుకోవడం నా అదృష్టం ” అని చేతులు పైకెత్తి నమస్కరిస్తూ అన్నారు. ఈ ఉదాహరణ చాలదూ వారి సంస్కారానికి, వినయానికి? సినిమా పాటలే కాదు, అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు ఘజల్స్ లోనూ ప్రావీణ్యులు పి.బి. శ్రీనివాస్ గారు! మన తెలుగు రాష్ట్రంలో కన్నా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గొప్ప గొప్ప సత్కారాలు పొందారు వీరు. అత్యుత్తమ అవార్డ్ అయిన “కన్నడ రాజ్యోత్సవ ” అవార్డు ఇచ్చి సన్మానించింది కర్ణాటక ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం “కళై మామణి , విద్వత్ శిరోమణి ” తో పురస్కరించింది. మన తెలుగు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఒక విద్వాంసుడికి ఏ అవార్డ్ ఇవ్వక తన గొప్ప చాటుకుంది. ఈ రోజు వారి జయంతి.

* డిగ్రీ కాలేజీ లెక్చరర్‌(నోటిఫికేషన్‌ 26/2018), టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌(నోటిఫికేషన్‌ 14/2019).. ఉద్యోగాలకు మెయిన్స్‌ పరీక్షల టైమ్‌ టేబుల్‌ మారింది. గత నెల 1న ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్‌ పోస్టులకు ఈ ఏడాది నవంబరు 28 నుంచి 30 వరకు మెయిన్స్‌ జరగాలి. అయితే, ఈ పరీక్షలు నవంబరు 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. అలాగే టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నవంబరు 6 మరియు 8 తేదీల్లో మెయిన్స్‌ జరగాలి. వీటిని నవంబరు 6న పేపర్‌-1, 2 మరియు 30న పేపర్‌-3 నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

* భారతదేశంలో స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు’ను ప్రదానం చేసింది. ఈ అవార్డును ప్రధాని మోదీకి బిల్ గేట్స్ అందించారు. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా తాను ఈ అవార్డు పొందడం తనకెంతో సంతోషంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవార్డు గౌరవం తనకు ఒక్కడికే కాదని స్వచ్ఛభారత్ కలను సాకారం చేసిన భారతీయులందరిదని మోదీ చెప్పారు. ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడం రికార్డు అని ప్రధాని అన్నారు.

* మోటారు వాహన నూతన చట్టం అమలులోకి వచ్చాక ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి అధికమొత్తంలో జరిమానాలు విధిస్తుండటంపై వాహనదారులు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారని వంటి వింత కారణాలకు జరిమానాలు విధించటంపై కూడా పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అటువంటి సంఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. చెప్పులు వేసుకొని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్‌ అనే ట్యాక్సీ డ్రైవర్‌కి చలానా విధించాడు. కానీ జరిమానా మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్‌ 6న చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రాజస్థాన్‌ ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తేలేదు.  దీని గురించి రాజస్థాన్‌ రవాణాశాఖ మంత్రి ప్రతాప్‌సింగ్‌ ఖచారియావాస్‌ మాట్లాడుతూ ‘ మేము ఇంకా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలుచేయలేదు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల అవలంబించే విధాన్నాన్ని గమనిస్తున్నాము.  ఇప్పటికే గుజరాత్‌ ఈ చట్టాన్ని నీరుగార్చి అమలుచేసింది. మేము వారి కంటే సాధ్యమైనంత తక్కువ జరిమానాల అమలుకు ప్రయత్నిస్తాము’ అని తెలిపారు.

* ఏపీలో మద్యం విక్రయానికి పరిమితులు విధింపు – మద్యం విక్రయానికి ప్రభుత్వం పరిమితులు విధించింది. పర్మిట్, లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి కలిగివుండే లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం 3 సీసాలు, మితలేటెడ్ స్పిరిట్ 3 బల్క లీటర్లు, బీరు 6 సీసాలు, కల్లు 2 బల్క లీటర్లు అమ్మాలని ప్రభుత్వం పేర్కొంది.

* రాష్ట్రంలో భారీ వర్ష సూచన కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది

* సీఎం జగన్​ అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. కౌలు రైతులకు రుణాల పంపిణీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్​లో రూ.24 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని.. అక్టోబరు 15 నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రైతు భరోసా కింద ఇచ్చే రూ.15,500ను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఆదేశించింది. ఈ విషయాన్ని బ్యాంకులకు స్పష్టం చేసింది.

* నేడు ఫ్రెంచ్​ ప్రతినిధులు బృందం ముఖ్యమంత్రి జగన్​ను కలవనుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండ్రోజులు పాటు బృంద సభ్యులు పర్యటించనున్నారు. ఉదయం విజయవాడలోని విజయ డైరీ మిల్క్​ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. మధ్యాహ్నం ఇబ్రహీంపట్నంలోని థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అనంతరం సచివాలయంలో సీఎస్​, వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు.