Agriculture

ఎరువుగా గోమూత్రం

Telugu Agricultural News-Cow Urine As Organic Manure

మనుషుల్లో అనేక జబ్బులను నయం చేసే దివ్యౌషధంగా దేశీయ ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ గోమూత్ర వినియోగానికి అధిక ప్రాధాన్యం ఉంది. గోమూత్రంలో సోడియం, గంధకం, ఎ, బి, సి, డి, ఇ వంటి విటమిన్లతోపాటు మాంగనీస్‌, ఐరన్‌, సిలికాన్‌, లాక్టోజ్‌, కార్బాలిక్‌ యాసిడ్‌, కాల్షియం సాల్ట్స్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో 95 శాతం నీరు, 2.5 శాతం యూరియా, 2.5 శాతం ఎంజైముల మిశ్రమం ఉంటుంది. గోమూత్రాన్ని ద్రవ ఎరువుగా ఉపయోగించవచ్చు. పురాతన భారతీయ గ్రంధాల్లో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ, ఆవు పాలు, ఇతర పదార్థాలతో కలిపి గోమూత్రాన్ని జీవ పురుగు మందుగా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల నేలలో పంటలకు మేలుచేసే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు పంటల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. గోమూత్రాన్ని ఉపయోగిస్తే.. దాని ప్రభావం తదుపరి పంట కాలంలో కూడా ఉంటుంది. గోమూత్రం నేలలో వానపాముల పెరుగుదలకు ఆవసరమైన అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వానపాములతో కలిగే ప్రయోజనాలు రైతులకు తెలిసిందే. ఆవు మూత్రాన్ని అనేక పంటల్లో మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగిస్తారు. జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పు, పిండి, నీరు కలిపి తయారు చేసిన మిశ్రమం) ఉపయోగించడం వల్ల వరి పంటలో పొడ తెగులు, అగ్గి తెగులు, ఆకుచుట్టు పురుగులను నివారించవచ్చు.జీవ పురుగు మందుగా..ఆవు పాలు, పెరుగు, మూత్రం, పేడ, నెయ్యి ఇలా ఐదు రకాల దేశీయ ఆవు ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేసిన పంచగవ్యను కూడా పంటల సాగులో ఎరువు, పురుగు మందుగా ఉపయోగిస్తారు. గోమూత్రాన్ని విడిగా లేదా ఇతర వృక్ష కషాయాలతో కలిపి వినియోగించవచ్చు. ఇది చీడపురుగుల అదుపునకు, లార్వా నాశనిగానూ పనిచేస్తుంది.గో మూత్రంతో వర్మీకంపోస్టునాణ్యమైన పంట దిగుబడులను పొందేందుకు.. పొలంలో మిగిలిపోయే సేంద్రియ (కుళ్లిపోయే స్వభావం ఉన్న పదార్థాలు) వ్యర్థాలు, పశువుల షెడ్‌లో మిగిలే వ్యర్థాలతో కంపోస్టు గానీ వర్మీకంపోస్టు గానీ తయారు చేసి వినియోగించుకోవచ్చు. ఈ రెండు రకాల ఎరువుల తయారీ సమయంలో గోమూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మరింత నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. సేంద్రియ సేద్యాన్ని అవలంబించే రైతులు ఈ పద్ధతిలో మేలైన ప్రయోజనాలను పొందవచ్చు.