Sports

నేను చేసింది ఏమీ లేదు. అంతా వారి ప్రతిభ.

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రిజర్వ్‌ బెంచ్ బలమేంటో క్రికెట్‌ ప్రపంచానికి తెలిసింది. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా బలమైన ఆసీస్‌ను.. కంగారూల గడ్డపై ఓడించి తమ సత్తాను భారత యువ ఆటగాళ్లు చాటిచెప్పారు. అయితే రిజర్వ్‌ బెంచ్‌ ఇంత బలంగా మారడానికి టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కారణమని కొనియాడుతున్నారంతా. గతంలో అండర్‌-19, భారత-ఎ జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం వల్లే ఆటగాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనపై వెల్లువెత్తుతున్న ప్రశంసలపై ద్రవిడ్ స్పందించాడు. ‘అది నా గొప్పతనం కాదు. ఆటగాళ్లు గొప్పగా ఆడారు. క్రెడిట్ వాళ్లకే దక్కాలి’ అని అన్నాడు. ఆసీస్‌ పర్యటనలో శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. వాళ్లంతా భారత్‌-ఎ తరఫున ఆడారు. గిల్‌, సుందర్‌ భారత అండర్‌-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కాగా, ద్రవిడ్‌ పర్యవేక్షణలో యువ ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపర్చుకోగా.. కోచ్‌ రవిశాస్త్రి హయాంలో అత్యుత్తమ ప్లేయర్లగా ఎదుగుతున్నారని మాజీ సెలక్టర్ జతిన్ పరంజమే కొనియాడారు.