Politics

రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలం

రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలం

రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్(Sardar Vallabhbhai Patel) స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం గుజరాత్‌(Gujarat)లోని కేవడియాలో పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

‘బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను చూడలేరు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారికి అండగా నిలబడేందుకూ వెనకాడరు. కొంతమంది రాజకీయ నేతలకు సానుకూల అంశాలు కనిపించవు. వారు దేశ ఐక్యత కంటే సొంత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు’ అని విపక్షపార్టీలపై మోదీ(Modi) మండిపడ్డారు. అలాగే త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అలాంటి నేతలు దేశాన్ని విభజించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటారని దుయ్యబట్టారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అందుకోసం పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ.. కశ్మీర్‌, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్(Sardar Vallabhbhai Patel) ఎక్కడున్నా సంతోషిస్తారని అన్నారు.

పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్‌లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా వారి ధైర్యసాహసాలను మోదీ(PM Modi) అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z