Health

ప్రతి ఐదేండ్లకు 12 శాతం చొప్పున పెరుగుతున్న రోగుల సంఖ్య

ప్రతి ఐదేండ్లకు 12 శాతం చొప్పున పెరుగుతున్న రోగుల సంఖ్య

క్యాన్సర్‌.. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతాం. ఈ క్యాన్సర్‌ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ప్రతి ఏడాది దాదాపు 50 వేల మంది పిల్లలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారట. అంటే ఈ లెక్కన గంటకు ఆరుగురు, ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున క్యాన్సర్‌కు గురవుతున్నారు.

క్యాన్సర్‌ బాధిత చిన్నారుల్లో కూడా 43.2 శాతం మంది బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితులే కావడం గమనార్హం. భారత్‌లో క్యాన్సర్‌ బారిన పడిన పిల్లల్లో 70 శాతం మంది వివిధ కారణాలతో సరైన చికిత్స అందక చనిపోతుంటే.. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో క్యాన్సర్‌ బాధిత పిల్లల్లో 80 శాతం బతుకుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 0 నుంచి 21 ఏండ్ల వయసున్న పిల్లల్లో 20 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం మంది పిల్లలు క్యాన్సర్‌ను జయిస్తుంటే.. మన దేశంలో ఆ సంఖ్య 30 శాతం కూడా దాటడం లేదు. పెద్దలతో పోలిస్తే క్యాన్సర్‌ మహమ్మారి నుంచి పిల్లలను కాపాడటం కొంత సులభమని వైద్య నిపుణులు చెబుతున్నా.. మన దేశంలో అందుకు తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సదుపాయాలు లేకపోవడం ఆందోళనకర అంశం.

పొగాకు సేవించడం వల్లే 33% మందికి..
పెద్దల విషయానికి వస్తే భారత్‌లో ప్రతి ఏడాది 13 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) నివేదిక ప్రకారం ప్రతి 5 ఏండ్లకు క్యాన్సర్‌ రోగుల సంఖ్య 12 శాతం పెరుగుతున్నది. ఎక్కువ శాతం మంది పొగాకు సేవనం కారణంగా క్యాన్సర్‌కు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలో 33 శాతం మందికి పొగాకు వల్ల క్యాన్సర్‌ వస్తున్నదని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు.

ఆ తరువాత ఊబకాయం వల్ల 20% మంది, వైరస్‌ వల్ల 16% మంది, జెనెటిక్‌ (వంశ పారంపర్యం) వల్ల 15% మంది, పౌష్టికాహార లోపం వల్ల 5 శాతం మంది, శారీరక శ్రమ లోపం వల్ల 5 శాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని డబ్ల్యుహెచ్‌వో నివేదిక పేర్కొన్నది. రొమ్ము క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, థైరాయిడ్‌ క్యాన్సర్‌లు 50 ఏండ్ల లోపు వారికి చాలా సాధారణమైందని, క్యాన్సర్‌ పీడుతుల్లో అత్యధిక శాతం మహిళలకు రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయం క్యాన్సర్‌ వస్తుండగా.. పురుషులు నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులేనని పేర్కొన్నది.

నిమిషానికి 17 మంది మరణం!

డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం క్యాన్సర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 17 మంది చనిపోతున్నారు.
భారత్‌లో ప్రతి 10 మంది క్యాన్సర్‌ రోగుల్లో ఏడుగురు మరణిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్‌తో చనిపోయే వారి సంఖ్య ముగ్గురు లేదా నలుగురిగా ఉన్నది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో క్యాన్సర్‌ రోగుల మరణాల రేటు రెట్టింపుగా ఉన్నది.

భారత్‌లో ప్రతి 2 వేల మంది క్యాన్సర్‌ రోగులకు ఒక వైద్యుడు ఉంటే, అమెరికాలో ప్రతి 100 మంది రోగులకు ఒక డాక్టర్‌ ఉన్నాడు. అంటే మన కంటే అమెరికాలో కాన్సర్‌ సంబంధిత వైద్యుల సంఖ్య 20 రెట్లు ఎక్కువ.

ఒక అంచనా ప్రకారం 2025 నాటికి మన దేశంలో 15 లక్షల 70 వేల మంది క్యాన్సర్‌ రోగులుంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z