Politics

ప్రజాపాలన కార్యక్రమంపై రేవంత్‌ ఉన్నత స్థాయి సమీక్ష

ప్రజాపాలన కార్యక్రమంపై రేవంత్‌ ఉన్నత స్థాయి సమీక్ష

డిసెంబర్‌ 26 నుంచి ఈ నెల 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.

సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన prajapalana.telangaana.gov .in వెబ్‌సైట్‌ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా.. ఇతర అభ్యర్థలనకు సంబంధించి 19 ,92 ,747 దరఖాస్తులు వచ్చాయి.

రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించగా.. ఇందులో 1,11,46,293 మంది పాల్గొన్నారు. మొత్తం 3,714 అధికారుల బృందాలు దరఖాస్తులు స్వీకరించారు. ఇందు కోసం 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటిని జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z