Politics

జమిలి ఎన్నికలపై విశేష స్పందన

జమిలి ఎన్నికలపై విశేష స్పందన

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచన (suggestions)లను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

దేశంలో జమిలి ఎన్నికల (Simultaneous Polls)ను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన మార్పులను సూచించాలని కోవింద్‌ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలిపింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z