Politics

గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా?

గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా?

ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్‌కు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామన్నారు. అల్లూరి జిల్లా అరకులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెదేపా అరకు కాఫీని ప్రమోట్‌ చేస్తే.. వైకాపా గంజాయిని చేస్తోందని విమర్శించారు.

‘‘గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైకాపా. నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్‌. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించా. నేను గతంలో ఇచ్చిన జీవో నెంబర్‌ 3ని ఎందుకు రద్దు చేశారో వైకాపా చెప్పాలి. సామాజిక న్యాయం చేస్తానని సీఎం గొప్పలు చెబుతున్నారు. జీవో నెంబర్‌ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? మళ్లీ తెదేపా అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తాం. గిరిజనుల కోసం మేం 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్‌ చెప్పాలి. గిరిజనుల పిల్లలు చదువుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం రద్దు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్‌షిప్పులు ఇస్తే.. దాన్నీ తీసేశారు. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేశారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చిన ఘనత తెదేపాది. గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్‌’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘‘గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా? సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్‌ పంపలేదు. స్కూటర్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఆయన నొక్కే బటన్‌ ఒకటి.. బొక్కే బటన్‌ ఒకటి. జగన్‌ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువ. విద్యుత్‌ ఛార్జీలు ఐదు రెట్లు పెంచేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z