🕑 Published: August 04, 2026 at 12:39 AM CST
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు న్యూజెర్సీలో పర్యటించారు. ఆయన గౌరవార్థం ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ఆధ్వర్యంలో ప్రవాసులతో సమావేశన్ని ఏర్పాటు చేశారు. న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), బీజేపీ కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.
రాంచందర్రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అఖండ భారత నిర్మాణం, దేశ సమగ్రాభివృద్ధి, సుశాసనం, జాతీయ భద్రత, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. గత పదకొండు–పన్నెండు సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్వమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో దేశంలో కేవలం 75 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ఎన్డీఏ ప్రభుత్వం గత 12 ఏళ్లలో వాటి సంఖ్యను 150కు పైగా పెంచి ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసిందని తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, గతి శక్తి, భారతమాల, సాగర్మాల, వందే భారత్ రైళ్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని వివరించారు. తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబులా మాట్లాడుతూ, అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దేశభక్తి, జాతీయవాద భావజాలంతో బీజేపీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి డి.వాసుదేవరావు, తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్. సాయిదిరెడ్డి, కృష్ణారెడ్డి అనుగుల, జయేష్ పటేల్, అమర్ గోస్వామి, శరత్ వేముల, కల్పనా శుక్లా, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, దీప్ భట్, పీయూష్ పటేల్, సుమ, రామ్ వేముల, రాజు రెడ్డి, ఉపేంద్ర చివుకుల, సురేష్ పటేల్, శ్రీనివాస్ జి., ప్రదీప్ కట్ట తదితరులు పాల్గొన్నారు.

