🕑 Published: July 13, 2026 at 02:36 PM CST
న్యూజెర్సీ రాష్ట్రంలోని మోన్రో టౌన్షిప్లో నిర్మాణంలో ఉన్న ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయ భూమిపూజ కార్యక్రమం జూన్ 24 నుండి 28 వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఐదు రోజుల మహోత్సవంలో చండీయాగ సహిత కోటి కుంకుమార్చన మహాయజ్ఞం నిర్వహించారు. కోటి కుంకుమార్చనలు విజయవంతంగా పూర్తయ్యాయి. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఈ స్థాయిలో నిర్వహించిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
భారతదేశంలోని తిరుమల, కాశీ, రామేశ్వరం, పెనుగొండ, వడపల్లి, పుట్టపర్తి వంటి పవిత్ర క్షేత్రాల నుండి తీసుకొచ్చిన మట్టి(మృత్తిక), సప్తనదీ జలాలు, స్వర్ణ శ్రీచక్రం ఈ మహా కార్యక్రమంలో వినియోగించారు. భూమిపూజ సందర్భంగా భక్తులు సమర్పించిన పవిత్ర ఇటుకలను భవిష్యత్తులో నిర్మించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి గర్భగుడి సమీపంలో తిరుమల ఏడుకొండలను సూచించే విధంగా ఏడు పొరలుగా ప్రతిష్ఠించారు. ఆలయ ఛైర్మన్ సూర్యనారాయణ మద్దుల, ఫౌండర్స్, ట్రస్టీలు, వేద పండితులు, వందలాది మంది సేవకులు, దాతలు పాల్గొన్నారు.
https://youtube.com/shorts/yEPFcsMfTmU
