Movies

స్వేచ్ఛను కోల్పోతాను

స్వేచ్ఛను కోల్పోతాను

ఎన్నో రాజకీయ పార్టీలు తనకు అవకాశమిస్తామన్నాయని అంటున్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కంగన తన రాజకీయ అభిప్రాయాల గురించి ఓ మీడియాతో చర్చించారు. ‘మా తాతగారు సర్జు సింగ్‌ రాజ్‌పుత్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ నాయకుడిగా పనిచేశారు. చాలా పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. నా మాటల ద్వారా యువతపై మంచి ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. కానీ నేను ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తే అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతాను. ప్రజలు, బంధాలు, భాగస్వాములు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు చాలా ఎక్కువైపోతున్నాయి. కానీ మన అదృష్టం ఏంటంటే.. రక్తపాతాలు లేవు. కేవలం ఒకరిపై ఒకరు బురద జల్లుకునే సంఘటనలే ఉన్నాయి. ఒకవేళ నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా నిస్వార్ధంగా, పార్టీకి కట్టుబడి పనిచేస్తాను’ అని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కంగన నటించబోతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘జయ’, తమిళంలో ‘తలైవి’ టైటిల్స్‌తో సినిమా విడుదల కాబోతోంది.