Sports

సింగపూర్ ఒపెన్‌లో దడదడలాడించిన తెలుగు అమ్మాయిలు

sindhu saina moves ahead in 2019 singapore open

సింగపూర్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల జోరు కొనసాగుతోంది. వీరంతా క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ సింధు 21-13, 21-19తో మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. ఆరో సీడ్‌ సైనా 21-16, 18-21, 21-19తో పోర్న్‌పావీ చొచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది. ప్రపంచ 21వ ర్యాంకర్‌ పోర్న్‌పావీపై విజయం కోసం సైనా చెమటోడ్చింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ శ్రీకాంత్‌ 21-12, 23-21తో హన్స్‌ క్రిస్టియన్‌ (డెన్మార్క్‌)పై, సమీర్‌వర్మ 21-15, 21-18తో గ్వాంగ్జు (చైనా)పై గెలుపొందారు. పారుపల్లి కశ్యప్‌ 9-21, 21-15, 16-21తో చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో, ప్రణయ్‌ 11-21, 11-21తో కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా- సిక్కిరెడ్డి 21-17, 6-21, 21-19తో టాంగ్‌ చున్‌- యింగ్‌ సుత్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్‌ చేరుకున్నారు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో పూజ- సంజన 15-21, 12-21తో ముత్సుయామ- చిహరు (జపాన్‌) చేతిలో ఓడారు.