Sports

కఠిన నిర్ణయాలు తీసుకునేవారినే ఎన్నుకోవాలి

sehwag will join politics if he gets 100crores

భారత్‌, పాక్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ యుద్ధం కన్నా తక్కువేమీ కాదని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. పేరు ప్రస్తావించకుండా కఠిన నిర్ణయాలు తీసుకొనే నాయకుడికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. గోవా ఫెస్ట్‌లో పాల్గొన్న వీరూ విలేకరులతో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్‌ ఆడుతుందా అన్న ప్రశ్నకు ‘ప్రస్తుతం రెండు అంశాలపై చర్చిస్తున్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం కావాలా?అని ఒకటి.. వద్దా?అని మరొకటి. ఇంకో విషయం ఏంటంటే దేశ సంక్షేమానికి ఏది మంచిదో అదే చేయాలి. మనం యుద్ధంలో గెలవాలి, ఓడిపోకూడదు’ అని వీరూ చెప్పాడు. లోక్‌సభ ఎన్నికలపై అడిగిన ప్రశ్నలకు వీరూ తనదైన శైలిలో జవాబు చెప్పాడు. ‘నాయకుడికి నిర్ణయాలు తీసుకొనే ధైర్యం ఉండాలి. దేశం, సైనిక, పోలీసు ప్రయోజనాల రీత్యా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు పార్టీలకు ఓటు వేస్తుండటంతో రాజకీయ నాయకులు ఎన్నికవుతున్నారు. ఏ పార్టీ అని కాకుండా నిర్ణయాలు తీసుకొనే నేతలే ఎన్నికవ్వాలి. సైన్యాన్ని బలహీనపరిచే వారిని.. ఓ వ్యక్తి స్వప్రయోజనాల కోసమో ఓటు వేయకూడదు. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేవారికే వేయాలి’ అని సెహ్వాగ్‌ చెప్పాడు. రాజకీయాల్లో చేరతారా అన్న ప్రశ్నకు ‘నేనెప్పుడూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేస్తా. రంజీల నుంచి ఐపీఎల్‌ వరకు అదే చేశా. ఏ పార్టీ నాతో మంచి ఒప్పందం కుదుర్చుకుంటుందో దాంట్లో చేరతా. అయితే ఆ ఒప్పందం విలువ రూ.100 కోట్లకు తగ్గరాదు’ అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.