Politics

ఏపీలో ఇంతటి అరాచక ఎన్నికలు చూడలేదు

chandrababu meets cec sunil arora in delhi

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో సీఈసీ సునీల్‌ అరోడాతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఫిర్యాదు చేశారు. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు, రేపు దిల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి కారణం ఎవరు? ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15 మంది తెదేపా ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అదికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైకాపా ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. వైకాపా ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, ఈ అంశంపై తెదేపా ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని మండిపడ్డారు. వైకాపా తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓటువేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోవడంలేదన్నారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదని, తెల్లవారు జామువరకు పోలింగ్‌ జరిగిందంటే ఇదేం.. ప్రజాస్వామ్యం?.. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందంటూ సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల్లో హత్య జరిగినా.. మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈవీఎంలు ఫెయిల్‌ కావడానికి కారణమేంటని నిలదీశారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని సీఎం గుర్తు చేశారు. పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్‌ చేశారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని, తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేపర్‌ బ్యాలెట్‌లపై అందరికీ అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించాయన్నారు. బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16గంటల సమయం పడుతుందని, మరి వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరు రోజులు సమయం ఎందుకు? అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.