Business

మద్రాసులో ఫాక్స్‌కాన్ ప్లాంట్! తక్కువ ధరకు ఐఫోన్లు!

foxconn plant in chennai

ఐఫోన్‌ అన్ని మోడళ్లు దేశీయంగానే తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ప్లాంటులో పరిమితంగా, కొన్ని పాత మోడళ్లు మాత్రమే తయారు చేస్తున్న సంగతి విదితమే. చెన్నై సమీపంలోని తమ ప్లాంటులో ఐఫోన్లు అన్ని మోడళ్లు పెద్దమొత్తంలో తయారు చేసేందుకు ఈ ఏడాదిలో సన్నద్ధమవుతున్నట్లు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు టెర్రీ గౌ వెల్లడించారు. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ, యాపిల్‌కు ఐఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో భారీఎత్తున తయారు చేసిస్తున్న సంగతి విదితమే. భారత్‌లో విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్న తరుణంలో, ప్రధాని మోదీ తనను ఆహ్వానించినట్లు టెర్రీ వివరించారు. యాపిల్‌ ఐఫోన్ల ఇటీవలి మోడళ్లు సహా అత్యధికం చెన్నై ప్లాంటులోనే తయారు చేస్తామని తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా అసెంబ్లింగ్‌ చేపట్టి, అన్నీ బాగుంటే పూర్తిస్థాయిలో చేపడతామని తైవాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టెర్రీ వివరించారు. భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో తాము కీలకపాత్ర పోషించనున్నామని పేర్కొన్నారు. తైవాన్‌ నుంచి ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. ఐఫోన్ల తయారీ, సామర్థ్య విస్తరణ కోసం భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,000 కోట్ల) పెట్టుబడిని ఫాక్స్‌కాన్‌ పెట్టనుందని సమాచారం. షరతులు, లభించే ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు టెర్రీ వివరించారు. ప్రస్తుతం అత్యున్నత సాఫ్ట్‌వేర్‌ నిపుణులు 12 మంది భారత్‌లో తమకు ఉన్నారని, వీరి సంఖ్యను 600కు పెంచుతామని తెలిపారు. దేశీయంగా సొంత విక్రయశాలలను కూడా యాపిల్‌ ప్రారంభించాలంటే, తయారీలో 30 శాతం విడిభాగాలను స్థానికంగా సమీకరించాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో వృద్ధి భారత్‌లో అధికంగా ఉండగా, చైనాలో వృద్ధి నిలిచిపోయింది. చైనాలో ఐఫోన్ల సంస్థ యాపిల్‌ వాటా తగ్గుతూ, హువావె, షియామీ అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం యాపిల్‌ వాటా చాలా తక్కువ. అధిక మోడళ్లను దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నందున, ధరలు అధికంగా ఉంటున్నాయి. అదే దేశీయంగా తయారు చేస్తూ, 20 శాతం వరకు దిగుమతి సుంకం కలిసివచ్చి, ధరలు తగ్గుతాయి. అందువల్ల భారత్‌లో అమ్మకాలు పెంచుకోవచ్చని యాపిల్‌ భావిస్తోంది. భారత్‌తో పోలిస్తే చైనాలో కార్మిక వ్యయాలు కూడా 3 రెట్లు అధికంగా ఉన్నాయని, అందువల్లే ఐఫోన్ల తయారీని భారత్‌కు మార్చేందుకు ఫాక్స్‌కాన్‌ సుముఖత చూపుతోందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ పేర్కొంటోంది. అందువల్లే దేశీయ విపణితో పాటు ఎగుమతికీ భారత్‌ను ఫాక్స్‌కాన్‌ కేంద్రంగా మార్చుకోవచ్చని అంటున్నారు. ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో సెల్‌ఫోన్ల అసెంబ్లింగ్‌ ప్లాంట్లున్నాయి. షియామీ, నోకియా ఫోన్లను ఈ ప్లాంట్లలో బిగిస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ల తయారీ కూడా చేపడితే, ఉత్పత్తుల సంఖ్య అధికమవుతుంది. యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ కొత్త మోడళ్లను ఏటా సెప్టెంబరు ప్రాంతంలో వెల్లడిస్తుంటుంది. ఆ సమయానికే భారత్‌లో తయారీ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా మొబైల్‌ఫోన్ల తయారీకి చైనాను కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ మార్చుకుంది. అతిపెద్ద తయారీ యూనిట్లతో పాటు వందల సంఖ్యలో భాగస్వామి సంస్థలు అక్కడ ఏర్పడ్డాయి. ఇప్పుడు యాపిల్‌ ఉత్పత్తుల తయారీని భారత్‌కు తరలిస్తే, ఈ ప్రభావం చైనాపై ఎంతవరకు పడుతుందో వేచి చూడాల్సిందే. చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చల్లబడని నేపథ్యంలో, తాజా పరిణామాన్నీ ఆ కోణంలోనూ చూడాల్సి ఉంది.