Devotional

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైత్రిపాల

srilankan president maithripala sirisena in tirumala

శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి బుధవారం ఉదయం వి ఐ పి బ్రేక్ లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ నుండి ఈ ఉదయం 6:10 గంటలకు మహాద్వారం చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన కు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి వెంట ఉండి తీసుకెళ్లారు. ముందుగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మ్రొక్కి అనంతరం బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారి గర్భాలయ బయట నిలబడి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, వకుళామాత దర్శనం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. అలాగే, రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రీలంక ప్రెసిడెంట్ దంపతులకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు లు శ్రీ పద్మావతి సమేత శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను శ్రీలంక ప్రెసిడెంట్ దంపతులకు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం, శ్రీలంక ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ పద్మావతి అధితి గృహానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీలంక ఎంబసీ డిప్యూటీ హై కమీషనర్ కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ బాబు, ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, డిప్యూటీ ఈఓ, బాలాజీ, ఓఎస్డీ లోకనాథ్, ఎఇఓ ధనుంజయ, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మనోహర్, సమాచార శాఖ డిడి తిమ్మప్ప, టీటీడి పీఆర్ఓ రవి, ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఆర్డీటీ రూప్ చంద్ తదితరులు పాల్గొన్నారు.