Politics

కాదేది ప్రచారానికి అనర్హం

congress campaigns on buffalo

ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్‌ను ఎన్నుకోండి. కాంగ్రెస్‌కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి ఆ గేదెను వదిలేశారు. అది వెళ్లిన ప్రతిచోటా జనం దాన్నే చిత్రంగా చూస్తున్నారు. కొందరు దానితో ఫొటోలను దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి ఖర్చూ లేకుండా… అందరి దృష్టినీ ఆకర్షిస్తుండటంతో స్థానిక యువత సంతోషించారు. గేదె విషయం అలా అలా… ఎన్నికల సంఘం దాకా చేరింది. నోరు లేని పశువులను ప్రచారానికి వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ వివాదంపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శైలేష్‌ నితిన్‌ త్రివేది స్పందించారు. ‘ఈ తరహా ప్రచారానికి మా పార్టీ వ్యతిరేకం. గేదెను వినియోగించిన స్థానిక యువతను గుర్తిస్తాం. వారిపై ఫిర్యాదు చేస్తాం’ అని ముక్తాయింపు ఇవ్వడం విశేషం. కవర్దా ప్రాంతం రాజ్‌నంద్‌గావ్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గురువారం ఇక్కడ పోలింగ్‌ జరుగనుంది.