Devotional

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

tirumala deity on gold chariot

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుహించారు. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.00 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ, తాము కూడా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా రెండవరోజు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. మూడవరోజైన  ఏప్రిల్ 19వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారని తెలియచేశారు. వసంత్సోవ వేడుకలను పురస్కరించుకొని ఏప్రిల్ 19వ తేది శుక్ర‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసిందన్నారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌, ఎస్‌ఇ 2 శ్రీరామచంద్రరెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు. ఈ నెల 19వ తేది శుక్ర‌వారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.