Sports

టీమిండియాతో ద్రవిడ్ ముచ్చట్లు

Dravid Meets Team India In Bengaluru | TNILIVE Telugu Sports News

ఇద్దరు టీమిండియా దిగ్గజాలు కలిస్తే అద్భుతంగా ఉంటుందని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా ఓ ఫొటో పోస్టు చేసింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ సందర్భంగా శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న కోహ్లీసేనను మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ కలిశాడు. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పాటు ఆటగాళ్లను కలిసిన అతడు వారితో కాసేపు ముచ్చటించాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను బీసీసీఐ పోస్టు చేసి ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ అంటూ పేర్కొంది. ఇండియన్‌ క్రికెట్‌ వాల్‌గా పిలుచుకునే రాహుల్‌ ద్రవిడ్‌ జులైలో జాతీయ క్రికెట్‌ అకాడమీకి హెడ్‌గా నియమితుడయ్యాడు. ద్రవిడ్‌ శిక్షణలోనే ఇండియా ఎ జట్టు తరఫున యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, కృనాల్‌ పాండ్య, రిషభ్‌పంత్‌, నవ్‌దీప్‌ సైని, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత వీరంతా టీమిండియాకి ఎంపికవ్వడం విశేషం. కాగా టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడుతున్న నేపథ్యంలో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా ఆదివారం బెంగళూరులో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉండగా రాహుల్‌ ద్రవిడ్‌ వారిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.