NRI-NRT

జనరంజకంగా జగన్ పాలన

Yarlagadda Lakshmi Prasad Meets With Dallas NRI YSRCP-జనరంజకంగా జగన్ పాలన

* డాలస్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
* ఎన్నారై వైకాపా మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచన

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఏపీ హిందీ అకాడమీ అధ్యక్షుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం సాయంత్రం డాలస్ ఎన్నారై వైకాపా శ్రేణులతో సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలు తమ జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని ఆనందం వెలిబుచ్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రూపొందించిన “నవరత్నాల” పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ధృఢసంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఎన్నారై వైకాపాతో పాటు ప్రవాసులు కూడా ఈ పథకాలకు సామాజిక మాధ్యమాల ద్వారా, వారి వారి సాంకేతిక విజ్ఞానం ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఆమోదించిన ఆంగ్ల మాధ్యమ జీవోను యార్లగడ్డ విశ్లేషించారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ICSE, CBSE పాఠశాలల్లో తెలుగు కనపడి, వినపడి, నేర్పబడి, నేర్చుకోబడుతుందని వెల్లడించారు. ఈర్ష్యా అసూయలకు పోకుండా, అసభ్యత అశ్లీలతలకు తావులేకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను డాలస్ ఎన్నారై వైకాపా శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ డా.ఆత్మచరణ్‌రెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, పుట్లూర్ రమణ, కొర్రి ఉమా మహేష్, డా.ప్రతాపరెడ్డి, డా.శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.