WorldWonders

హైదరాబాద్‌లో…బిర్యానీ కోసం వ్యక్తి హత్య

Friends Fight For Biryani-One Dies In Hyderabad

వారంతా స్నేహితులు.. ఆనందంగా మద్యం సేవించారు. హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్నారు. బిల్లు చెల్లించే విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన వివరాలు ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.. హన్మకొండకు చెందిన అభిలాశ్‌ (28) రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది నుంచి ముషీరాబాద్‌ డివిజన్‌ వైఎస్సార్‌ పార్కు వద్ద అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు జాబ్‌ చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వంశీ, చందు, హరీశ్‌లతో స్నేహం కుదిరింది. ఈ క్రమంలో ఈ నెల 24 రాత్రి నలుగురు కలిసి మద్యం సేవించారు. అనంతరం నారాయణగూడ వెళ్లి బిర్యానీ తిన్నారు. బిల్లు నువ్వు చెల్లించమంటే..నువ్వు చెల్లించమని వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అంతా కలిసి వైఎస్సాఆర్‌ పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వంశీ..అభిలాశ్‌ను తోసేయడంతో పక్కనే ఉన్న రాయిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అభిలాశ్‌ తండ్రి రమేశ్‌ ముషీరాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.